World Public Services

Telugu News for change makers

20071128

త్వరలో జాతీయ పొగాకు నియంత్రణ సంస్థ

పొగాకు నిరోధక చట్టాన్ని అమలుచేసేందుకు 'జాతీయ పొగాకు నియంత్రణ సంస్థ'ను ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి అన్బుమణి రాందాస్‌ లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యుడు కావూరి సాంబశివరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో, పాఠశాలల పరిసరాల్లో పొగతాగడంపై నిషేధం, 18 ఏళ్లలోపు వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా చూడటం వంటి అంశాలు ఈ సంస్థ పరిధిలోకి వస్తాయన్నారు. బీడీ, సిగరెట్‌ పెట్టెలపై చట్టబద్ధమైన హెచ్చరికల ముద్రణ, వాటిల్లో తార్‌, నికోటిన్‌ ఏస్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారో లేదో కూడా పరిశీలిస్తుందన్నారు.

Labels: ,

20071126

2008 డిసెంబర్ నాటికి 22 జిల్లాల్లో ' ఆరోగ్యశ్రీ'

2008 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని 22 జిల్లాల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి సంబాని చంద్రశేఖర్ ఖమ్మం జిల్లా వైరాలో విలేకరుల సమావేశంలో  వెల్లడించారు.  పేదలకు నాణ్యమైన కార్పొరేట్‌స్థాయి వైద్యాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఆసియాలోనే మొట్టమొదటిగా రాష్ట్రంలో పేద ప్రజల కోసం రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలుచేస్తున్నట్లు చెప్పారు.

Labels: ,

స్మార్ట్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ ప్రారంభం

ఢిల్లీ ప్రభుత్వం స్మార్ట్ కార్డు ప్రాజెక్టును ప్రారంభించింది. 16 కేబి స్మార్టు కార్డు ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్‌లు ఢిల్లీ  లోని ఒక జోనల్ కార్యాలయం నుండి జారీ అవుతున్నాయి. దశలవారీగా ప్రాజెక్టు తక్కిన జోన్లలో కూడా అమలవుతుంది. స్మార్టు కార్డుకు  నకిలీ కార్డును సృష్టించడానికి వీలు కాదు. ఎలక్ట్రానిక్ చిప్ కార్డు డ్రైవరు చేసిన తప్పులను, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ సమాచారాన్ని, కార్డు కలిగి ఉన్న వ్యక్తి జీవిత భీమా వివరాలను భద్రపరుస్తుంది. ఢిల్లీలో ఏటా 3.5 లక్షల లైసెన్స్‌లు జారీ అవుతున్నాయి.

Labels:

20071125

పౌర హక్కులపై విద్యార్థులకు పోటీలు

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యం లోని సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇనస్పెక్షన్ విజిలెన్స్ వారోత్సవాలలో భాగంగా పౌర హక్కులపై విద్యార్థులకు పోటీలు నిర్వహించింది. వ్యవసాయ ఉత్పత్తులపై ఆగ్ మార్క్ నాణ్యతా చిహ్నాన్ని ఈ డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇనస్పెక్షన్ సంస్థ ఇచ్చే విషయం అందరికీ తెలిసినదే. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కన్స్యూమర్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి గాలి ఉదయ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు ఉదయ కుమార్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇనస్పెక్షన్ అధికారి మోహన్ నాయుడు స్వాగతోపన్యాసం చేశారు.

Labels:

20071124

తప్పుడు సమాచారంతో పొందిన బీమా క్లెయిమ్స్

మోసంతో కాని, తప్పుడు సమాచారంతో కాని పొందిన బీమా పోలసీ క్లెయిమును చెల్లించకుండా బీమా కంపెనీ తిరస్కరించవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తప్పుడు సమాచార విషయం రుజువైన పక్షంలో అసలు పోలసీనే రద్దుచేయవచ్చునని జస్టిస్ ఎస్బీ సిన్హా, జస్టిస్ హెచ్ఎస్ బేడీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కేరళకు చెందిన చాకోచాన్ అనే వ్యక్తి మరణానంతరం ఆయన కుటుంబీకులు ఎల్ఐసీ పాలసి క్లెయిము చేశారు. పాలసీ తీసుకున్న ఆరునెలలకే ఆయన మరణించారు. తనకు థైరాయిడ్ ఆపరేషన్ జరిగిందన్న విషయాన్ని పాలసీ తీసుకున్న సమయంలో ఆ ఇంటియజమాని దాచి పెట్టారని, దరఖాస్తులో దానికి సంబంధించిన చోట 'నో' అని పేర్కొని తప్పుదోవ పట్టించారని క్లెయిమును ఎల్ఐసీ తిరస్కరించడంతో వివాదమైంది. కేరళ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం పాలసీదారు కుటుంబానికి అనుకూలంగా, అప్పీలులో బహుళసభ్య ధర్మాసనం ఎల్ఐసీకి అనుకూలంగా తీర్పులిచ్చాయి. ఇప్పుడు సుప్రీం.. హైకోర్టు డివిజన్‌బెంచి తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వు జారీచేసింది.

Labels: ,

ఎయిడ్స్ నిరోధక వ్యాక్సిన్ ప్రయోగం విఫలం

దేశీయంగా తయారుచేస్తున్న ఎయిడ్స్ నిరోధక వ్యాక్సిన్(టీకా) తొలి దశ ప్రయోగాలు విఫలమయ్యాయి. దేశంలోనే ప్రప్రథమంగా రెండేళ్ల క్రితం పరిశోధనలు ప్రారంభించిన పుణేలోని నేషనల్ ఎయిడ్స్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (ఎన్ఎఆర్ఐ) శాస్త్రవేత్తలు రూపొందించిన ఎయిడ్స్ వ్యాక్సిన్‌ పరీక్షల్లో విఫలమైంది. మొదటిదశ పరీక్షల్లో భాగంగా 2005లో 30 మందిపై అడెనో అసోసియేటెడ్ వైరస్ వెక్టర్ వ్యాక్సిన్ ప్రయోగించి చూశారు. కానీ వారిలో 80 శాతం మందిలో వ్యాక్సిన్ ప్రభావం చూపించలేకపోయింది. వ్యాక్సిన్ ప్రయోగించిన వారిలో వెంటనే రోగనిరోధక శక్తి ఆశించినంతగా పెరగలేదు.. అందువల్ల ఈ వ్యాక్సిన్ రెండోదశ ప్రయోగాలకు వెళ్లదలుచుకోవడం లేదని ఎన్ఎఆర్ఐ డైరెక్టర్ రమేష్ పరంజపే తెలిపారు. వ్యాక్సిన్‌ను మూడుదశల్లో ప్రయోగించాలని శాస్త్రవేత్తలు మొదటగా భావించారు. మొదటిదశలో 30మందిపై వ్యాక్సిన్‌ను ప్రయోగించి, పనితీరును అధ్యయనం చేశారు. మొదటిదశ ఫలితాలు సంతృప్తికరంగా వస్తే , రెండోదశలో 500 మందిపై మూడోదశలో వేలాదిమందిపై పరీక్షించి చూడాలని భావించారు. ఇదీ విజయవంతం అయితే వేలాది మందిపై ప్రయోగించి టీకా ఉత్పత్తిని ప్రారంభించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ తొలి దశలోనే టీకా అంతగా ప్రభావం చూపలేదు.

Labels: , ,

ప్రపంచంలో 3.7 కోట్ల మంది అంధులు

ప్రపంచంలో మొత్తం 3.7 కోట్ల మంది అంధులున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వారిలో 67 లక్షల మంది ఒక్క భారత్‌లోనే ఉన్నారని, అంటే ప్రతి ఐదుగురు అంధుల్లో ఒకరు భారతీయులని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 2001-02లో దేశంలో అంధుల సంఖ్య మొత్తం జనాభాలో 1.1 శాతం ఉండగా 2006-07 నాటికి 1 శాతానికి తగ్గింది. 2020 నాటికి 0.3 శాతానికి అంధుల సంఖ్యను తగ్గించాలని జాతీయ అంధత్వ నివారణ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌లోని నేత్ర నిధి కేంద్రాల జాతీయ సంఘం లెక్కల ప్రకారం మన దేశంలో 500 నేత్ర నిధి, నేత్రదాన కేంద్రాలు ప్రతి ఏటా 30వేల కళ్లను సేకరిస్తున్నాయి.

Labels:

20071123

వికలాంగులకు రుణాలపై రాయితీ పెంపు

వికలాంగ విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులతో సమానంగా ఉపకారవేతనాలు, ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 23వ తేదీన మహిళా, శిశు సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, ఏపీ డైరీలపై ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సమీక్ష జరిపిన అనంతరం మంత్రి రాజ్యలక్ష్మి వికలాంగులు పొందే రుణాలపై రాయితీని రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పోరేషన్‌ల ద్వారా ఇచ్చే రుణాలపై రూ.10వేల వరకూ రాయితీ ఇస్తుండగా... వికలాంగుల కార్పోరేషన్ అందించే రుణాలపై రూ.3వేలు మాత్రమే రాయితీ కల్పిస్తున్నారు.

Labels: ,

20071121

భారతదేశంలో తగ్గుతున్న ఎయిడ్స్

భారతదేశంలో హెచ్ఐవీ/ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గింది.  దేశంలో ఎయిడ్స్ వ్యాప్తి నియంత్రణలోనే ఉందని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన తాజా లెక్కల్లో తేలింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎయిడ్స్ నియం త్రణ విధానం ఫలితాలనిస్తోందని, ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్ విభాగ భారతదేశ సమన్వయ కర్త డెనిస్ బ్రౌన్ చెప్పారు. సమితి అంచనా ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం 25లక్షల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు ఉన్నారు. తమిళనాడు, మహారాష్ట్రలో ఎయిడ్స్ కేసులు తగ్గగా, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పెరిగాయి.  అంచనా వేసిన దానికన్నా ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ కేసు లు ఏడు మిలియన్లు తగ్గాయని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఎయిడ్స్ రోగుల సంఖ్య 39.5 మిలియన్లకు చేరుకుంటుందని తెలిపారు.

Labels: , ,

శంకర ఐ ఫౌండేషన్‌కు విరాళం

కాలిఫోర్నియా: శంకర నేత్రాలయ ఫౌండేషన్‌కు నిధుల సేకరణార్థం ఇండియన్ క్లబ్ శాన్ మాటోలోని హైస్కూల్‌లో  'ఇండియన్ కలర్స్' పేరుతో సంగీత కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన  11,037 డాలర్ల మొత్తాన్ని ఇండియన్ క్లబ్ అధ్యక్షురాలు సింధూరి గొల్లమూడి  శంకర నేత్రాలయ ఫౌండేషన్ చైర్మన్ మురళీ కృష్ణమూర్తి కి అందజేశారు.

Labels:

యువకళాకారులకు ఉపకార వేతనాలు

యువ కళాకారులు 2008-09 సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సాంస్కృతిక వ్యవహారాలశాఖ అధికారులు ఒక ప్రకటనలో కోరారు. 10-14 సం|| మధ్య వయస్సు ఉండి శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, నృత్యం, నృత్యరూపకం, నాటకం, జానపద కళల్లో అభిరుచి ఉన్నవారు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనాలు పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు డిసెంబరు 20వ తేదీలోగా దరఖాస్తులను సంచాలకులు, సాంస్కృతిక శాఖ, కళాభవన్, రవీంద్రభారతి, సైఫాబాద్, హైదరాబాద్ అనే చిరునామాకు పంపించాలి. పూర్తి వివరాలను www.ccrtindia.gov.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.

Labels: ,

20071115

చిట్‌ఫండ్ సవరణ బిల్లు ఆమోదం

1971 నాటి చిట్‌ఫండ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.  చిట్‌ఫండ్ కేసులను సివిల్ కోర్టుల పరిధి నుంచి తీసివేసి రిజిస్ట్రార్‌లకు బదలాయించడం ఈ సవరణ లలో ఒకటి. చిన్నమొత్తాల్లో చిట్‌లు కట్టేవారిని రక్షించడం కోసమే చట్టంలో సవరణలు తెస్తున్నామని మంత్రి రత్నాకరరావు అన్నారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని  నిబంధనలను తీసుకునే సవరణలు చేశామని, తాము కొత్తగా ఏమీచేయలేదని చెప్పారు. దీని ప్రకారం ఇక నుంచి లక్ష రూపాయల చిట్‌కు 50 శాతం డ్రాఫ్టు రూపంలో, మిగిలిన 50 శాతం బ్యాంకు నుంచి గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.  కోర్టుల్లో మూడు వేల చిట్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కేసులు త్వరగా పరిష్కారమయ్యేందుకు అధికారులను నియమిస్తున్నామని, శిక్షణ కూడా ఇస్తున్నామని చెప్పారు.

Labels: ,

20071107

పత్రికా చట్టంలో మార్పులు రానున్నాయా?

ఇపుడు అమలులో వున్న ప్రెస్, పుస్తకాల రిజిస్ట్రేషన్ (పిఆర్‌బి) యాక్ట్ 140 సంవత్సరాల కిందటిది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో  వెలువడుతున్న ఆన్‌లైన్ న్యూస్ పోర్ట ల్‌లు, పత్రికల వెబ్ ఎడిషన్లను కూడా పత్రికా  చట్టం పరిధిలోకి తేవాలని ప్రభుత్వంయోచిస్తున్నది. వీటితోపాటు ప్రత్యేకంగా వార్తల ప్రసా రానికే ఏర్పాటు చేసిన టీవీ చానల్‌లు  కూడా ఉన్నాయి. కాబట్టి ఈ చట్టంలోని ముద్రణ, వార్తాపత్రిక వంటి సంబంధిత పదాలను సవ రించాలనీ, పునర్ నిర్వచించాలని ప్రభుత్వం భావిస్తు న్నట్లు సమాచారం. ఇదే జరిగితే బ్లాగర్లు కూడా ఇక ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా లైసెన్సు తీసుకోవాల్సి వస్తుందేమో..

Labels: ,

20071106

వి.ఎస్.ఎస్.లతో గిరిజన కుటుంబాలకు లబ్ధి

విశాఖపట్నం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాల వల్ల గిరిపుత్రుల జీవన పరిస్థితులు మెరుగవుతున్నాయని రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (ఆర్.ఎ.పి) డి.కె.ఝా పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పరిధిలో మొత్తం 5డివిజన్లలో 'వన సంరక్షణ సమితి సభ్యుల పునరావాస పథకం' అమలు తీరును పర్యవేక్షించేందుకు ఏర్పాటైన స్వతంత్ర సభ్యుల పర్యవేక్షక సంఘం సమీక్ష ఫలితాలను వెల్లడించిన సందర్భంగా ఝా మాట్లాడుతూ 5 అటవీ డివిజన్లలో చాలా మంది ఆదివాసీలు, గిరిజనులు పోడు వ్యవసాయం మాని, వన సంరక్షణ సంఘాలుగా ఏర్పడ్డారని, వాళ్లందరికీ ప్రభుత్వం పునరావాసం కల్పించేందుకు సాయం చేస్తోందని వివరించారు. పోడు భూమిని అప్పగించిన ప్రజలకు నష్ట పరిహారం ఇచ్చేలా 2000 నుంచి జె.ఎఫ్.ఎం. రెండో దశ (రీసెటిల్‌మెంట్ యాక్షన్ ప్లాన్- ఆర్.ఎ.పి) అమలు చేస్తున్నారు. మొత్తం రూ. 28 కోట్ల అంచనాతో ప్రారంభించిన ఈ పథకంలో ఇప్పటికి రూ. 7 కోట్లు ఖర్చు చేసి, 434 గ్రామాల్లోని 11,600 కుటుంబాలకు లబ్ధి చేకూర్చినట్లు ఝా తెలిపారు. ఈ ఆర్.ఎ.పి. అమలు తీరును పర్యవేక్షించేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ భాస్కరరావు నేతృత్వంలో వివిధ రంగాలకు చెందిన ఐదుగురు నిపుణులు సభ్యులుగా ఒక 'స్వతంత్ర సలహా బృందం'(ఇండిపెండెంట్ అడ్వైజరీ గ్రూప్- ఐ.ఎ.జి)ను ప్రభుత్వం నియమించింది.

Labels: , ,

చట్టపరిధిలోకి మొబైల్ ఫోన్ టవర్లు

మొబైల్ ఫోన్ టవర్లు హానికరమైన ఎలక్ట్రోమేగ్నటిక్ రేడియేషన్‌ను వెలువరిస్తుండటంతో వాటిని క్రమబద్ధీకరిస్తూ చట్టాన్ని రూపొందించమని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. సెల్యులార్ సర్వీసు ప్రొవైడర్లకు చెందిన 3,000 టవర్లు నగరంలో ఉన్నాయి. ప్రతి రోజు ఒకటి లేదా రెండు టవర్ల స్థాపన జరుగుతూనే ఉంది. టవర్ల నుండి వెలువడే రేడియేషన్ స్థాయి డేటాపై ఖచ్చితమైన ప్రమాణాలు ఇప్పటి వరకు లేవు. దీనికి సంబంధించి ఎటువంటి చట్టం లేకపోవడంతో ప్రభుత్వం ఏ రకమైన చర్యా తీసుకోలేక పోతోంది.

Labels: , , ,

కొనసాగుతున్న 'దేవదాసీ' వ్యవస్థ

13 ఏళ్ళ దళిత బాలిక 'దేవదాసీ' కావడానికి కొద్ది సమయానికి ముందు చెన్నయ్ అధికారులు జోక్యం చేసుకుని ఆ ఉచ్చు నుంచి బయట పడేశారు. తమిళనాడు గ్రామాల్లో అంటరానితనం, దేవదాసీ వ్యవస్థ లేనే లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ ఇవి జరుగుతూనే ఉన్నాయి. విల్లుపురం జిల్లాలోని గ్రామంలో కృష్ణవేణి అనే ఈ 13 ఏళ్ళ దళిత బాలిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది. గ్రామంలోని ఆలయంలో తండ్రి, గ్రామపెద్ద, పూజారి సమక్షంలో దేవదాసిని చేస్తున్న సమాచారం అందుకున్న వెంటనే అధికారులతో పాటు అక్కడకు చేరుకున్న పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ కుటుంబంలో మూడు తరాలుగా దేవదాసీ తంతు జరుగుతున్నట్లు తెలియవచ్చింది. గ్రామాల్లో ఇప్పటికీ ఈ ఆచారం వుందా అనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Labels: ,

జీతం కోసం నాలుగేళ్ల పాటు ఎదురు చూపులు

తుది వేతన పత్రాన్ని (ఎల్‌పీసీ) అందజేయకుండా మహిళా ఉద్యోగిని నాలుగేళ్ల పాటు ఇబ్బందులకు గురి చేసిన ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ మానవహక్కుల కమిషన్ చొరవతో దిగివచ్చారు. సీల్డ్‌కవర్‌లో ఎల్‌పీసీని కమిషన్ ఛైర్మన్‌కు అందజేయటంతో వేతనం తీసుకునేందుకు ఆమెకు అడ్డంకి తొలగినట్లైంది.

డైరెక్టర్ గణాంకాల విభాగంలో డివిజనల్ అకౌంట్స్ అధికారి (డీఏఓ)గా పనిచేస్తున్న కె.శైలజ డిప్యూటేషన్‌పై 2000 సంత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డీఏఓగా విధుల్లోకి చేరింది. 2003 లో ఆమెను మాతృసంస్థకు పంపుతూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. శైలజకు ఎల్‌పీసీ ఇవ్వకుండా ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. తుది వేతన పత్రం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాకపోవడం తో ఆమె జీతం తీసుకునేందుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యా యి. పలుమార్లు తనకు ఎల్‌పీసీ ఇవ్వాలని రిజిస్ట్రార్‌ను కోరినా ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ఆమె ఔటర్ రింగ్‌రో డ్డు ప్రాజెక్టు కార్యాలయంలో అసిస్టెం ట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. మాతృసంస్థ నుంచి అనేకమార్లు ఎల్‌పీసీ పంపాలని కోరినా రిజిస్ట్రార్ స్పందించకపోవడంతో శైలజ గత ఆగస్టు 22న మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. నవంబర్ ఒకటో తేదీలోగా ఓపెన్‌కోర్టుకు హాజరై నివేదిక ఇవ్వాల్సిందిగా రిజిస్ట్రార్‌ను కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ఆదేశించారు. కోర్టుకు హాజరైన రిజిస్ట్రార్ ఆమె బదిలీ అవుతూ బాధ్యతలు అప్పగించలేదని కమిషన్ దృష్టికి తెచ్చారు. రిజిస్ట్రారే స్వయంగా ఆమెను మాతృసంస్థకు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన విషయంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేయగా, అదే రోజు మధ్యాహ్నం శైలజ ఎల్‌పీసీని సీల్డ్‌కవర్‌లో ఉం చి కమిషన్‌కు సమర్పించారు. నాలుగేళ్లగా ఆమెకు రావాల్సిన వేతనాన్ని ఈ నెల 12వ తేదీలోగా చెల్లించి, తమకు సమగ్రమైన నివేదికను అందజేయాలని ప్రభుత్వాన్ని సోమవారం కమిషన్ ఛైర్మన్ సుభాషణ్‌రెడ్డి ఆదేశించారు.

Labels: ,

పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నతుమ్మ

ఢిల్లీలో పర్యావరణ పరిరక్షణ కోసం రోడ్డు వెంట నాటిన 'తుమ్మ (ప్రొసోపిస్ జులిఫ్లోరా)' మొక్కలు జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరించిన ఈ మొక్కలను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఢి ల్లీలో 7,777మొక్క లు నాటారని, ఇవి పెరుగుతున్న ప్రాంతంలో ఇతర వృక్షజాతులు మనుగడ సాగించడం లేదని సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ ఆఫ్ డీగ్రేడెడ్ ఎకోసిస్టమ్స్(సీఈఎండీఈ)కి చెందిన ప్రొఫెసర్ సీఆర్ బాబు వెల్లడించారు. ' చెట్ల వేర్లు దాదాపు 21మీటర్ల లోతు మేరకు భూమిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వర్షపు నీరు లోపలికి వెళ్లడం సాధ్యం కాదు. ఈ మొక్క సమీపంలోని నేలలో భూసారం, తేమ తగ్గుతుంది'అని అంటారాయన. వీటి ఆకుల్లో ఒక రకమైన రసాయనం ఉండడం వల్ల అవి మండే స్వభావం కలిగి ఉండడంతో పాటు త్వరగా కుళ్లిపోయే అవకాశముండదని నిపుణులు చెబుతున్నారు. తుమ్మ వల్ల కలిగే హాని గురిం చి తెలుసుకోవడానికి గుజరాత్ పర్యావరణ శాఖ కచ్ ప్రాంతంలో నిర్వహించిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. ఈజాతికి చెందిన మొక్కలు ఎదుగుతున్న ప్రాంతాల్లో జీవవైవిధ్యం, ఉపాధి తీవ్రంగా దెబ్బతింటోందని పరిశోధకులు గుర్తించారు. తుమ్మ మొక్కలు దట్టంగా ఉండి అధికభాగాన్ని ఆక్రమించడం వల్ల నేలపై వెలుతురు ప్రసరించే వీలుండడం లేదని కనుగొన్నారు. తుమ్మ మొక్కలు నాటిన తరువాత కచ్ ప్రాంతంలో ఒక పక్షి కూడా కనపడలేదంటే వీటి ప్రభావం ఎలా ఉంటుం దో సులభంగానే గ్రహించవచ్చు. వీటిని తినడం వల్ల అక్కడ భారీ సంఖ్యలో పశువులు మరణించాయి. ప్రభుత్వం ఏమంటోంది ? ఈ విషయమై పర్యావరణశాఖ సీనియర్ సైంటిఫిక్ అధికారి డాక్టర్ బీ.సీ. సబత్ స్పందిస్తూ ఈమొక్కలను ధ్వంసం చేసి వీటి స్థానంలో కొత్తవి నాటడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు.

Labels: , ,

20071105

ఇఎంఆర్‌ఐ సర్వీసు లకు మరో 122 అంబులెన్స్‌లు

సత్యం ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న ఇఎంఆర్‌ఐ సర్వీసు లకు ఈ యేడాది అదనంగా మరో 122 అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వం సమ కూర్చనుందని, ఈ యేడాది ఇఎంఆర్‌ఐ, హెచ్‌ఆర్‌ఎంఐ సర్వీసులకోసం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ కింద 32 కోట్లరూపాయలను కేటాయించనున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి సంభాని చంద్రశేఖర్‌ చెప్పారు. ఇఎంఆర్‌ఐ,హెచ్‌ఎంఆర్‌ఐ సర్వీసుల నిర్వహణకోసం 95శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చడానకి అవగాహన ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం, సత్యం ఫౌండేషన్‌ ప్రతినిధుల తరుపున సచివాలయంలో సంతకాలు జరిగాయిం. ఎమర్జెన్సీ సర్వీసులు, ఆరోగ్యసమాచార సర్వీసులకు సంబంధించి సత్యం ఫౌండే షన్‌ వద్ద ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 380 అంబులెన్సులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్యంఫౌండేషన్‌ ప్రతినిధి డాక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్న మూడు జిల్లాల్లో ఆరోగ్య సమాచార సర్వీసులను అందిస్తున్నామని చెప్పారు. ఇఎంఆర్‌, హెచ్‌ఎంఆర్‌ఐ లోగోల స్థానంలో రాజీవ్‌ ఆరోగ్య శ్రీ లోగోలను ఇక మీదట ఉపయోగించనున్నట్లు మంత్రి చెప్పారు.

Labels: , , ,

ఎటిఎంలు ఇకపై రైళ్లలో

ఎటిఎంలు రైళ్లలో కూడా ఏర్పాటుకాబోతున్నాయి. ఖాతా దారులు రైళ్లల్లో ఏర్పాటు చేయబోతున్న ఎటిఎంల నుంచి డబ్బు డ్రా చేసు కునే సౌలభ్యం పొందబోతున్నారు. ఎం పిక చేసిన రైళ్లల్లో ఎటిఎంలను నెలకొ ల్పడానికి రైల్వేలు ప్రణాళికలు రూపొం దిస్తున్నాయి. పైలెట్‌ ప్రాజెక్టు కింద కొన్ని రైళ్లల్లో ఎటిఎంలను ఏర్పాటు చేయడా నికి సన్నాహాలు చేస్తున్నారు.

Labels: , ,

20071104

సమస్యలను పట్టించుకోని సెల్‌ఫోన్ సంస్థలు

సెల్‌ఫోన్ సంస్థలు వినియోగదారుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఇండియా మొబైల్ సర్వీసెస్ (ఐబీఎస్) సర్వే నిర్వహించి తేల్చింది. సెల్‌ఫోన్ సంస్థలు వినియోగదారుల కోసం రూపొందించే కస్టమర్ కేర్ సర్వీస్ (సీసీఎస్) కేంద్రాలు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని పెదవి విరిచింది.
సర్వే అధ్యయన ప్రధానాంశాలివి.
* వినియోగదారులు తమ ఫిర్యాదులపై సీసీఎస్ నుంచి సంతృప్తికర సమాధానం పొందాలంటే కనీసం ఆరు నిమిషాలు పడుతోంది.
* దేశంలో 11 సెల్ సంస్థలున్నా, వినియోగదారులకు సంతృప్తికరమైన సమాధానాలిచ్చే వాటిని వేళ్లమీద లెక్కబెట్టవచ్చు.
* టెలిఫోన్ రెగ్యులేట్ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వినియోగదారుల సేవలకు సంబంధించి అనేక విధివిధానాలు నిర్దేశించింది. అయితే ప్రొవైడర్లు వాటిని అందుకోలేకపోతున్నారు.
* సేవల వైఫల్యానికి అపరిమితంగా పెరుగుతున్న వినియోగదారుల సంఖ్య కూడా కారణమే.
* వీటిపై ప్రభుత్వం తగిన చర్యలు చేపడితేనే వినియోగదారులకు ఆశించిన స్థాయిలో సేవలు అందుతాయి.

Labels: ,

ఇతర చట్టాల ఉల్లంఘనతో సంబంధం లేదు

బీమా పాలసీకి సంబంధించిన నియమనిబంధనలను పాలసీదారుడు ఉల్లంఘించనంతవరకూ, అతని క్లెయిములను చెల్లించాల్సిందేనని జాతీయ వినియోగదారుల కమిషన్ తీర్పుచెప్పింది. పాలసీదారుడు వేరే చట్టాలనుకాని, నిబంధనలను కాని ఉల్లంఘించినప్పటికీ, బీమా అనేది రెండు పార్టీల మధ్య వ్యవహారమైనందువల్ల అతనికి క్లెయిముల చెల్లింపు నిలిపివేసే అధికారం బీమా కంపెనీలకు లేదని జస్టిస్ ఎంబీ షా, కమిషన్ సభ్యులు రాజ్యలక్ష్మీరావు, కేఎస్ గుప్తా స్పష్టం చేశారు.

Labels: , ,

రిలయన్స్ నష్టపరిహారం ఇవ్వాల్సిందే!

విద్యుత్ సరఫరా చేయని కారణంగా పంట దెబ్బతిన్న ఓ రైతుకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్. రిలయన్స్ సంస్థ అధీనంలోని బీఎస్ఈఎస్ కంపెనీని ఆదేశించింది. విద్యుత్ సరఫరాకు అవసరమైన స్కిరల్ కండక్టర్ అనే విద్యుత్ తీగ అపహరణకు గురైనట్టుగా సంబంధిత రైతు ఫిర్యాదు చేసినందున, కొత్తగా ఆ కండక్టర్‌ను తెచ్చి వేసి విద్యుత్‌ను సరఫరా చేయాల్సిన బాధ్యత బీఎస్ఈఎస్‌పై ఉందని కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ జేడీ కపూర్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇందర్‌సింగ్ గహలౌట్ 8 నెలలుగా విద్యుత్ సరఫరా లేక చాలా ఇబ్బందులు పడ్డాడని, తనకు సరఫరా జరగడం లేదని ఫిర్యాదు చేసినా కంపెనీ పట్టించుకోలేదని, అందువల్ల కంపెనీ తన సేవల్లో లోపం జరిపిందని కమిషన్ తీర్మానించింది.

Labels: , ,

20071101

'వైద్య పరీక్ష' ఆర్‌టీఐ పరిధిలోకి రాదు: సీఐసీ

సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద వైద్య పరీక్షలకు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) నిరాకరించింది. వైద్యుడు, రోగికి మధ్యనున్న సంబంధం విశ్వాసంతో కూడుకొని ఉన్నదని, అందువల్ల వైద్య పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఝాన్సీ నివాసి అర్జేష్ కుమార్ మాధోక్ తన కుమారుడు ఆదిత్యకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)లో నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికలను ఆర్‌టీఐ చట్టం కింద బహిర్గతం చేయాలని సీఐసీని కోరారు. ఆ వైద్య పరీక్షలు మాధోక్ భార్య కోరితేనే నిర్వహించామని, ఇప్పుడు ఆ నివేదిక వివరాలను ఇతరులకు వెల్లడించమని సీడీఎఫ్‌డీ పేర్కొంది. సీడీఎఫ్‌డీ నిర్ణయాన్నిసీఐసీ సమర్థించింది. వైద్య పరీక్షలకు సంబంధించిన వివరాలను కోరడం ఆమె ఆంతరంగిక విషయాల్లో తలదూర్చడమేనని సీఐసీ వ్యాఖ్యానించింది.

Labels: , ,

20071029

ప్లాట్లను విక్రయించొద్దు

నెలసరి వాయిదాల చొప్పున డబ్బు వసూలు చేసి అనంతరం ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకుంటున్నారని బాధితులు ఓ రియల్ ఎస్టేట్ సంస్థపై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఫోరం కేసును విచారణకు స్వీకరించి తుది తీర్పు వెలువడే వరకు ఆ ప్లాట్ల క్రయ, విక్రయాలు జరపరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 'శ్రీ సాయిమిత్ర హౌసింగ్ కార్పొరేషన్' రియల్ ఎస్టేట్ సంస్థ హయత్‌నగర్ మండలంలోని సుర్మాయిగూడ గ్రామంలో వెంచర్ వేసి, వాయిదాల పద్ధతిన డబ్బు చెల్లిస్తే కాలపరిమితి ముగియగానే రిజిస్ట్రేషన్ చేయించి ప్లాట్లను అప్పగిస్తామని ప్రచారం చేసింది. దీంతో ఎల్లారెడ్డిగూడకి చెందిన డి. బ్రహ్మనాయుడు 2005 నవంబర్ 5న ఆ వెంచర్‌లోని 167, 168 ప్లాట్లకై తన తల్లి పేరిట రూ. 1,18,000 అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకున్నారు. 2007 జనవరి 9న మరో రూ. 1,52,000లు కాలపరిమితి కంటే ముందే పూర్తి మొత్తాన్ని చెల్లించారు. వాటితోపాటు అభివృద్ధి ఖర్చులకు గాను రూ.20,000లు, రిజిస్ట్రేషన్ ఖర్చులకు 15,000లు కూడా సంస్థకు ముట్టజెప్పారు. అనంతరం సంస్థ ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడానికి నిరాకరించింది. దీంతో ఒప్పందం ప్రకారం ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలంటూ న్యాయవాది ద్వారా ఓ లీగల్ నోటీస్ పంపినప్పటికీ, సంస్థ నుంచి కాని దాని నిర్వాహకుడు కోటేశ్వర్‌రావు నుంచి కాని స్పందన రాకపోవడంతో బాధితులు రంగారెడ్డి జిల్లా ఫోరంను ఆశ్రయించారు. ఫోరం ఆ రెండు ప్లాట్లపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి క్రయ విక్రయాలు జరపరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Labels: , ,

ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ఖర్చు 41.76 శాతం

జీతాలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వ  ఉద్యోగులు వాపోతుంటే.. ప్రభుత్వం  వారిపై పెడుతున్న ఖర్చును బాగా తగ్గించుకునే సన్నాహాల్లో ఉంది. 12వ ఆర్థిక సంఘం సూచన ప్రకారం 2009-10కి రాష్ట్ర రెవెన్యూ వ్యయంలో జీతాల వాటా 35 శాతానికి తగ్గాలి. 2005-06 ఆడిట్ లెక్కల ప్రకారం ఈ వాటా 41.76 శాతంగా ఉంది. ఆ ఏడాది వడ్డీ, పింఛను చెల్లింపులు కాకుండా జీతభత్యాల రూపేణా రూ.10,455 కోట్లు ఖర్చయ్యింది. జీతాల వ్యయం వాటాను ఏటా తగ్గించుకుంటూ మరో రెండేళ్లలో 35 శాతం లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.

Labels:

20071028

మహిళా సంఘాల కోసం ప్రత్యేక బ్యాంకు

మహిళ స్వయంసహాయక సంఘాలకు రుణాలను అందించడానికి ఒక బ్యాంకును ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని కేంద్ర వ్యవసాయమంత్రి శరద్‌పవార్ వెల్లడించారు. స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) మహిళల ఆర్థిక స్వయసమృద్ధి కోసం కృ షి చేస్తున్నాయని ఆయన అన్నారు. ఆయన కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు సుప్రియా సులె మహారాష్ట్రలో ఎస్‌హెచ్‌జీ ఉద్యమానికి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ఎస్‌హెచ్‌జీ కార్యకలాపాలపై ప్రభుత్వ నియం త్రణ ఉండదని మంత్రి అన్నారు.

Labels: ,

చలిగాలులతో మరణానికీ బీమా

చలిగాలులతో కలిగే మరణం ప్రమాదవశాత్తు సంభవించిన మరణం కిందకే వస్తుందని జాతీయ వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. అలాంటి మరణాలకు బీమాసంస్థలు బీమా సొమ్మును నిరాకరించడం కుదరదని తేల్చిచెప్పింది. చలిగాలులు ఊహించని పరిణామాలని, ప్రణాళికతో సిద్ధంచేసి ఉంచేవి కాదని పేర్కొంది. బీహార్‌కు చెందిన రతీదేవి అనే మహిళ భర్త చలిగాలులతో మరణించడంతో ఆమె 'జాతీయ బీమా కంపెనీ లిమిటెడ్ సంస్థ' నుంచి తన భర్తకు రావాల్సిన బీమా సొమ్ముకోసం దరఖాస్తు చేశారు. చలి గాలులు ప్రమాదం కిందకు రావని బీమా సంస్థ తిరస్కరించింది. జాతీయ కమిషన్ రతీదేవి వాదనను సమర్థించి, ఆమెకు రూ.3.10 లక్షల బీమా సొమ్ము ఇవ్వాలని ఆదేశించింది.

Labels: , ,

20071027

ఐడెంటిటీ కార్డ్ ఉంటేనే రిజర్వేషన్ తో ప్రయాణం

రైల్లో రాయితీపై ప్రయాణించే సీనియర్ సిటిజన్లు తమ వయస్సు ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకెళ్లడం తెలిసిందే.అలాగే ఇకపై రిజర్వేషన్ చేయించుకొని ప్రయాణించే వారంతా తమ ఐడెంటిటీ నిరూపించే కార్డు లేదా ఇతర ఆధారాన్ని, చిరుమానా ధ్రువీ కరణను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలంటూ ఉత్తర రైల్వే ప్రయాణికులందరికీ సూచించింది. ఒకవేళ అవి లేకుంటే, ప్రయాణికుడు వేరొకరి టికెట్‌పై ప్రయాణిస్తున్నట్లు పరిగణించి రైల్వే చట్టం కింద చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. మరొకరి పేరు మీదున్న టికెట్‌తో ప్రయాణిస్తే రూ.500 జరి మానా, మూడు నెలల జైలు శిక్ష విధించే అవకాశ ముంటుందని హెచ్చరించింది. అనధీకృత ట్రావెల్ ఏజెంట్ల మోసాలు, రద్దీ సమయాల్లో భారీగా టికెట్లు బుక్ చేసి, బ్లాక్‌లో విక్రయించే వారి ఆగడాలకు అడ్డు కట్ట వేసేందుకే ఈ ఐడెంటిటీ కార్డుల నిబంధనను పెడుతున్నట్లు తెలిపింది.

Labels: ,

20071026

ఫార్మా సంస్థలకు ఔషధ నియంత్రణశాఖ నోటీసులు

అనుమతులు లేకుండా రాష్ట్రంలో అమ్ముతున్న పలు మందును ఔషధ నియంత్రణశాఖ నిషేధించింది. రాష్ట్రంలో 33 రకాల (కాంబినేషన్ల) మందులు అనుమతులు లేకుండా అమ్ముతున్నట్లు గుర్తించామని, పది కంపెనీలు ( డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, బయోలాజికల్‌ఈ, నాట్కోఫార్మా, అరబిందో ఫార్మా, కాంటెస్ట్‌ కెమికల్స్‌, సిటాడెల్‌, వ్యాన్‌గార్డ్‌, నోయల్‌ఫార్మా, టార్‌గాఫ్‌, యూనిసాన్‌క్యో కంపెనీలు) వీటిని తయారు చేస్తున్నాయని ఔషధ నియంత్రణ శాఖ డీజీ ఆర్‌.పి.మీనా చెప్పారు. ఇలాంటి మందులపై డ్రగ్స్‌, కాస్మొటిక్స్‌ చట్టం 122ఈ నిబంధన ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ మందుల్ని తయారుచేస్తున్న ఫార్మా కంపెనీలు 15 రోజుల్లోగా మార్కెట్లోని తమ ఉత్పత్తుల్ని వెనక్కు తీసుకోవాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జ్వరం, జలుబు వంటి సాధారణ రుగ్మతల మొదలు వివిధ జబ్బుల్ని తగ్గించే మందులు, యాంటీబయాటిక్స్‌ మొదలైనవి ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిపారు. తాము నిర్వహించిన దాడుల్లో హైదరాబాద్‌లోనే రూ.1.41 కోట్లు, విశాఖపట్నంలో రూ.53 లక్షలు, విజయవాడ పరిధిలో రూ.2 కోట్ల విలువైన మందుల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మందులకు జాతీయ ఔషధ నియంత్రణ శాఖ అనుమతులు తీసుకోకుండా ఇతర రాష్ట్రల్లో నామమాత్రపు అనుమతులు తీసుకుని మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు మీనా పేర్కొన్నారు. ఇలాంటి మందులు వినియోగించే వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని, కాబట్టి మందుల వాడకంలో జాగ్రత్త వహించాలని సూచించారు.

Labels: , ,

20071025

వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మూడు నెలల్లోగా వివాహ రిజిస్ట్రేషన్ చట్టాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హిందూ సాంప్రదాయంలో వివాహం చేసుకునే వారికి వివాహాల రిజిస్ట్రేషన్ చట్టం ద్వారా క్రింది కోర్టు ఇచ్చిన మినహాయింపును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భారతదేశంలోని ప్రతి ఒక్కరికి కుల, మత, వర్గ విచక్షణ లేకుండా వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని ఆయా రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోర్టు ఆదేశించింది.

Labels: ,

రైళ్లలో సీసీ కెమెరాలు

ముంబయి రైల్వే అధికారులు సబర్బన్ రైళ్లలోని మహిళల బోగీల్లో క్లోజ్‌డ్ సర్క్యూట్ (సీసీ) కెమెరాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ రైల్వే పరిధిలో ప్రథమ శ్రేణి మహిళా బోగీల్లో ఆరు సి.సి. కెమెరాలను బిగించారు. ఆడ పిల్లలను వేధించే వారిపై, జేబులు కత్తిరించే వారిపై, ఇతరత్రా అల్లర్లకు పాల్పడే వారిపై కన్నేసి ఉంచేందుకు వీటిని బిగించారు. ఇవి సత్ఫలితాలిస్తే మిగతా రైళ్లలో కూడా ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. తీవ్రవాదుల దాడులకు సబర్బన్ రైళ్లు ఎంత అనుకూలమో గత ఏడాది జులై 11వ తేదీన జరిగిన బాంబు పేలుళ్లు వెల్లడించాయి. దీంతో రైళ్లలోనూ, రైల్వే స్టేషన్లలోనూ భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించారు. చర్చి గేటు, విరార్ మధ్య ఉన్న రైల్వే స్టేషన్లన్నిటిలో సి.సి. టి.వి.లు ఏర్పాటు చేయడానికి పశ్చిమ రైల్వే అంగీకరించింది. ఇప్పటి వరకు 66 సి.సి. టి.వి.లను నెలకొల్పింది. ఇప్పుడు రైళ్ల లోపల వీటిని నెలకొల్పడం వల్ల ప్రయాణికులు, ప్రత్యేకించి మహిళా ప్రయాణికుల విశ్వాసం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. రైలు ప్రవేశ ద్వారంతో పాటు కూర్చున్న, నిలబడిన మహిళలందరినీ సి.సి. టి.వి.లు కవర్ చేస్తాయి. సెక్యూరిటీతో పాటు మహిళల మెడల్లో గొలుసులు లాక్కెళ్లడం, జేబులు కత్తిరించడం లాంటి సంఘటనలపై కూడా కన్నేసి ఉంచడానికి దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. 15 రోజుల్లో జరిగిన సంఘటనల వివరాలన్నీ ఈ కెమెరాలు అందచేస్తాయి.

Labels: ,

జనన మరణాల వార్షిక నివేదిక

జనన మరణాల వార్షిక నివేదిక-2006ను ఆర్థిక, ప్రణాళిక శాఖల మంత్రి డాక్టర్ ఎ.కె.వాలియా 24.10.2007 బుధవారం విడుదల చేశారు. నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఢిల్లీలో జనన, మరణాల రేటు జాతీయ స్థాయి కంటే తక్కువగా ఉంది. ఏటా ప్రతి వెయ్యి మందికి జనన రేటు జాతీయ స్థాయిలో 23.8 ఉండగా, ఢిల్లీలో 19.95 మాత్రమే నమోదయింది. మరణాల రేటు జాతీయ స్థాయిలో ఏటా వెయ్యిమంది జనాభాకు 7.6 ఉండగా ఢిల్లీలో 6.11 ఉంది. దేశంలో ప్రతిరోజూ 71812 మంది జన్మిస్తుండగా, అందులో 884 మంది ఢిల్లీలో పురుడుపోసుకొంటున్నారు. రోజూ దేశంలో 22932 మంది మరణిస్తుండగా ఢిల్లీలో 271 మంది మరణిస్తున్నారు. ఢిల్లీలో 2005లో 3.24 లక్షల జననాలు నమోదుకాగా 2006లో 3.23 లక్షలు నమోదయ్యాయి. 2006లో నమోదయిన 3.23 లక్షల జననాల్లో అబ్బాయిలు 1.76 లక్షలు ఉండగా అమ్మాయిలు 1.47 లక్షలు మాత్రమే. అంతకు ముందు ఏడాది 1.78 లక్షల మంది అబ్బాయిలు, 1.46 లక్షల మంది అమ్మాయిలు ఢిల్లీలో జన్మించారు. 2005తో పోలిస్తే 2006లో అమ్మాయిల జననాల సంఖ్య పెరిగింది. ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 2005లో 822 మంది అమ్మాయిలు జన్మించగా 2006లో 831కు పెరిగింది. జననాల సంఖ్య కూడా తగ్గింది. ప్రతి వెయ్యి మంది జనాభాకు 2005లో 20.61 జననాలు నమోదుకాగా.. 2006లో 19.95కు తగ్గింది. ప్రతిరోజూ నమోదవుతున్న జననాల సంఖ్య కూడా 889 నుంచి 884కు దిగివచ్చింది. మొత్తం 78 శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. అంతకు ముందు ఏడాది 74 శాతం ప్రసవాలే ఆసుపత్రుల్లో జరిగేవి. ప్రతి వెయ్యి మంది జనాభాకు 2006లో 6.11 మరణాలు నమోదు కాగా అంతకు ముందు ఏడాది 7.6గా నమోదయ్యాయి. 2006లో 98908 మంది మరణించగా... అందులో 37 శాతం మంది 60 ఏళ్లు, అంతకన్నా వయసు పైబడిన వాళ్లు ఉన్నారు. 22 శాతం మంది 31-50 వయసుల వాళ్లు. 15 శాతం మంది 51-60 మధ్య వయస్కులు. 12 శాతం మంది 15-30 సంవత్సరాల యువకులు. 14 శాతం మంది 14 సంవత్సరాల వయసు లోపలి వాళ్లే. వీటితో పాటు 5825 శిశుమరణాలు కూడా నమోదయ్యాయి. ఇంటి వద్దే పురుడు పోసుకున్న శుశువుల్లో 60 శాతం మంది చనిపోయారు.

Labels: , ,

చెత్త మీద రూ.22 కోట్లు మిగులు

ఢిల్లీ నగరంలో చెత్త ఏరుకునేవారు ఢిల్లీ ప్రభుత్వానికి ఏటా రూ.22 కోట్లను ఆదా చేస్తున్నారని అసోఛామ్ ఐఎల్ఎఫ్ అండ్ ఎస్ ఎకోస్మార్ట్ అధ్యయనం తెలిపింది. ప్రభుత్వం సేకరించే దానికన్నా చెత్త ఏరుకునేవారే ఎక్కువగా చెత్త సేకరిస్తున్నారని, నగరంలోని సాలిడ్ వేస్ట్‌లో 17 శాతాన్ని చెత్త ఏరుకునేవారు సేకరించి, వేరు చేసి ఉచితంగా రవాణా చేస్తున్నారని అధ్యయనం తెలిపింది. ఈ అనియత చెత్త వ్యాపారం కారణంగా ప్రభుత్వానికి రోజుకు ఆరు లక్షల రూపాయలు ఆదా అవుతున్నాయని అధ్యయనం పేర్కొంది. మున్సిపల్ సాలిడ్‌వేస్ట్‌లో అధిక భాగాన్ని ఏ జాగ్రత్తలు పాటించకుండానే లోతట్టు ప్రాంతాలలో పారవేస్తున్నారని కూడా అధ్యయనంలో ఉంది. భారతదేశంలో ఉత్పత్తయే ప్లాస్టిక్ వృధాలో 40 నుంచి 80 శాతాన్ని రీసైకిల్ చేస్తున్నారని, అభివృద్ధి చెందిన దేశాలలో ఈ రిసైక్లింగ్ రేటు 10 నుంచి 15 శాతం మాత్రమేనని అధ్యయనం తెలిపింది.

Labels: , ,

139 నెంబరుతో కాల్‌సెంటర్ రైల్వే సమాచారం

రైల్వేకు సంబంధించిన ఏదైనా సమాచారం కోసం దక్షిణాది రాష్ట్రాలన్నిటి కోసం 139 నెంబరుతో కాల్‌సెంటర్‌ను రైల్వే ప్రారంభించింది. తమిళనాడు నుంచి ఈ కేంద్రం పనిచేస్తున్నా, నాలుగు రాష్ట్రాల పరిధిలో ఎక్కడి ప్రజలైనా కేవలం ఒక లోకల్‌కాల్‌తో తమకు కావాల్సిన సమాచారాన్ని రోజులో ఏ సమయంలోనైనా పొందే వీలుంది. అంటే 24X7 విధానంలో ఇది పనిచేస్తుంది. 'ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం' (ఐ.వి.ఆర్.ఎస్.)లోనే కాకుండా అవసరమైతే సిబ్బంది ద్వారా కూడా సమాధానాలు ఇచ్చే ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రయాణికులు చేయాల్సిందల్లా ఏంటంటే కంప్యూటర్లో వినిపించే సులభమైన సూచనలను పాటిస్తూ పోవడమే. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, ఇంగ్లిష్, హిందీ భాషల్లో విస్తారమైన సమాచారాన్ని ఈ కాల్ సెంటర్ అందిస్తుంది. సాధారణంగా రైళ్ల రాకపోకల వేళలు, బెర్తుల లభ్యత, పి.ఎన్.ఆర్. నెంబరు ఆధారంగా టికెట్ల తాజా స్థితి వంటివి తెలుసుకునేందుకు ఎక్కువమంది రైల్వే ఎంక్వయిరీకి ఫోన్ చేస్తుంటారు. 139లో ఇలాంటి వివరాలను ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా చిటికెలో ఇవ్వడమే కాకుండా వేరే స్టేషన్లకు సంబంధించిన సమాచారాన్ని సిబ్బంది ద్వారా తెలియపరుస్తారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి పుణె వెళ్లే రైళ్ల గురించి విశాఖలోని ప్రయాణికుడు తెలుసుకోవాలంటే 139 నెంబరుతో సాధ్యమే. నాగ్‌పూర్ స్టేషన్లో ఏసీ డార్మిటరీ వసతి ఉందో లేదో రాజమండ్రి ప్రయాణికుడు ఇట్టే తెలుసుకోవచ్చు. ఆయా స్టేషన్లలో ఉండే వసతి సదుపాయాలు, ప్రయాణికులకు అందుబాటులో ఉండే వసతులు, వివిధ రాయితీలు, సర్క్యులర్ టికెట్లు... ఇలా రైళ్లకు సంబంధించిన ఏ సమాచారం కావాలంటే దానిని అందించేందుకు వీలుగా 'కస్టమర్ కేర్ కాల్ సెంటర్'ను తీర్చిదిద్దారు.

Labels: ,

20071023

'కామన్‌మాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌'

'కామన్‌మెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌'ను ప్రారంభిస్తున్నట్లు సినీ నటుడు పవన్‌ కళ్యాణ్ ప్రకటించారు. ఇందుకు కోటి రూపాయల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలున్నాయని, వాటితో కలిసి పనిచేస్తామనీ, ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అక్రమాలు జరిగినా తాము ఉంటామని వివరించారు. సమాజ సేవ చేయడానికి రాజకీయాల తోడు అక్కర్లేదన్నారు. తను చేసేది సమాజ సేవ మాత్రమేనంటూ... రాజకీయ రంగులు
పులమవద్దన్నారు. మరో నాలుగు నెలల్లో ఈ సంస్థ చురుగ్గా పని చేస్తుందన్నారు. నా పేరు మీద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో రూ.1.32 కోట్లున్నాయి. అందులో కోటి రూపాయల్ని విరాళంగా ఇస్తున్నా. మీడియాతోనూ చేతులు కలుపుతా. మీడియా ఎన్నో మంచి పనులు చేస్తోంది. మా సాయాన్ని కూడా అందిస్తాం. మరిన్ని మంచి పనులు చేయగలుగుతాం.
నాకున్నది చాలు. ఇక ఆస్తులొద్దు. పొలాలు కొనుక్కోను. ప్రజలకు సాయం చేస్తాను. నేను ఇంత డబ్బుని తినలేకపోతున్నా. నేను చస్తే ఆరడుగులు చాలు. అందుకే నా జీవితాన్ని సంఘానికి అర్పిస్తున్నా. ఎవరికి ఎప్పుడు ఏ
అవసరమొచ్చినా నెం.32, నందగిరి హిల్స్‌, జూబ్లీ హిల్స్‌ చెక్‌పోస్ట్‌, హైదరాబాద్‌లోని నా ఇంటికి రావచ్చు. 9866344833, 9866344733 అనే నెంబర్లకు ఫోన్‌ చేయొచ్చు'' అన్నారు.

Labels: ,